Maharashtra | హైదరాబాద్, అక్టోబరు 28 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు సమాచారం. దీంతో వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. మహారాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి వద్ద ఉన్న రూ.16,000 కోట్ల నిధుల్లో కొంతమేర ఉపయోగించుకుంటూ పథకాన్ని కొనసాగించారు. అయితే ప్రతి నెలా 7 నుంచి 8 లక్షల మంది కార్మికులకు భోజనాలు పెట్టినట్టు లెక్కల్లో చూపారు. కరోనా సద్దుమణిగే నాటికి రూ.2,500 కోట్లు ఖర్చు అయినట్టు లెక్కల్లో వెల్లడించారు.
అన్నీ తప్పుడు లెక్కలే
ఒక జల్గాం జిల్లాలోనే 70 వేల మంది కార్మికులకు భోజనాలు పెట్టినట్టు లెక్కల్లో చూపి రూ.24 కోట్లు తీసుకున్నారు. భోజనాలు చేసిన వారిలో 80 ఏండ్ల ముసలోళ్లు కూడా ఉన్నారు. ధారా శివ్ జిల్లాలో పేరు నమోదు చేసుకున్న కార్మికులు 7,915 మంది కాగా 35,216 మందికి భోజనాలు పంపిణీ చేసినట్టు లెక్కల్లో చూపారు. భోజనాల పంపిణీ కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. పథకంలో అవినీతిపై ఎన్సీపీ ఎమ్మెల్యే ఏక్నాథ్ ఖడ్సే విధాన పరిషత్లో ప్రశ్నించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలు విజయ్ వడెట్టివార్, నానా పటోలే, అనిల్ దేశ్ముఖ్లు కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో స్పందించిన కార్మిక శాఖ మంత్రి సురేశ్ ఖడ్సే ఓ కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నవంబర్ 1 నుంచి ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.