న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దొంగలు ఇష్టమొచ్చిన ట్టు రెచ్చిపోతున్నారు. సింగ్రౌలీ జిల్లాలో సాయుధులైన కొంతమంది ఓ బ్యాంక్ లో చొరబడి ఖాతాదారులను, సిబ్బందిని బందీలుగా చేసుకొని, భారీ దోపిడీకి పాల్పడ్డారు. దాదాపు 9 నుంచి 10 కిలోల బంగారం, రూ.20 లక్షల నగదు దోచుకొని పారిపోయారు. చోరీ సొమ్ము విలువ సుమారుగా రూ.5.7 కోట్లు ఉంటుందని అంచనా! బైధాన్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్లో గత శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ ఘటన చోటుచేసుకుంది. తుపాకులు పట్టుకొని ఐదుగురు వ్యక్తులు బ్యాంక్లో చొరబడగా, అందులో ఒక వ్యక్తి మాత్రమే ముసుగు వేసుకొని ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీళ్లు బ్యాంక్లోకి అడుగుపెట్టిన వెంటనే గాలిలో కాల్పులు జరిపి..అందర్నీ భయభ్రాంతులకు గురి చేసినట్టు తెలిసింది.
ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఒక ఖాతాదారుడు విలేకర్లతో మాట్లాడుతూ, ‘మొదట ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. తుపాకీతో బెదిరించి మమ్మల్ని బందీలుగా చేసుకున్నారు. అందరి మొబైల్ ఫోన్లు లాక్కొని..దుర్భాషలాడారు. మేనేజర్ ఎక్కడున్నాడో చెప్పమని డిమాండ్ చేశారు. చెప్పకపోతే కాల్చివేస్తామని బెదిరించారు. సిబ్బంది దగ్గరున్న లాకర్ల తాళాలు తీసుకొని పారిపోయారు’ అని చెప్పారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. దొంగలు నేరుగా బంగారం లాకర్లను లక్ష్యంగా చేసుకున్నారని, తాళాలు అప్పగించాలని, నగదు నిల్వల వివరాలు వెల్లడించాలని దుండగులు బ్యాంక్ మేనేజర్ను బలవంతం చేశారని, అతనిపై దాడి చేసినట్టు పోలీసులు చెప్పారు.