న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఒకవైపు ఒమిక్రాన్ ఉపద్రవం ముంచుకొస్తుండగా దేశంలో మాస్కు వాడకం భారీగా తగ్గిందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం మాట్లాడుతూ.. పెండ్లిళ్లు, వేడుకల్లో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. సెకండ్ వేవ్ కన్నా ముందు కూడా మాస్కు వాడకం తగ్గిందని గుర్తుచేశారు. ఒమిక్రాన్ సోకిన చాలామందిలో మోస్తరు లక్షణాలు (మైల్డ్ సింప్టమ్స్) మాత్రమే ఉన్నట్లు గుర్తించినట్టు పేర్కొన్నారు.
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కు వాడకంపై అలసత్వం వద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్, మాస్కు చాలా అవసరమని చెప్పారు.
నిప్పుకోళ్లలో ఉండే యాంటిబాడీలను ఉపయోగించి జపాన్లోని క్యోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మాస్కు తయారు చేశారు. ఈ మాస్కును యూవీ లైట్ కింద ఉంచినప్పుడు దానిపై కరోనా వైరస్ ఉంటే తెలిసిపోతుంది.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కి చేరింది. తాజాగా శుక్రవారం గుజరాత్లో ఇద్దరికి, మహారాష్ట్రలో ఏడుగురికి కొత్త వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిలో మూడేండ్ల చిన్నారి కూడా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
రెండో డోస్ వేసుకున్న 9 నెలల తర్వాతే బూస్టర్ డోస్ వేసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) పార్లమెంటరీ కమిటీకి వెల్లడించింది. బూస్టర్ డోస్ కోసం కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదని తాజా పరిశోధనలో తేలిందని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ చెప్పారు.