న్యూఢిల్లీ, మే 5: విద్య, ఉద్యోగ అవకాశాల్లో మరాఠా సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ హక్కును ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ చట్టాన్ని రద్దు చేస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. 1992లో మండల్ తీర్పు సందర్భంగా మొత్తం రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని తొలగించాల్సినంత ‘అసాధారణ పరిస్థితులు’ ప్రస్తుతం ఏమీ లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. మండల్ తీర్పును పునఃసమీక్షించేందుకు, విస్తృత ధర్మాసనానికి కేసును బదిలీ చేసేందుకు కూడా కోర్టు నిరాకరించింది. ఇప్పటికే పలు సందర్భాల్లో కోర్టు మండల్ తీర్పును సమర్థించిందని గుర్తుచేసింది. ఈమేరకు జస్టిస్ అశోక్భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు స భ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.
మరాఠా కోటాకు ప్రాతిపదిక అయిన గైక్వాడ్ కమిషన్ నివేదిక.. ఆ వర్గానికి రిజర్వేషన్లు కల్పించడానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులను ఎక్కడా ప్రస్తావించలేదని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో మరాఠా కోటా చెల్లుబాటు కాదని ధర్మాసనం ఏకాభిప్రాయం వ్యక్తంచేసింది. అలాగే 102వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధమేనని పేర్కొన్నది. అయితే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను (ఎస్ఈబీసీలను) గుర్తించేందుకు రాష్ర్టాలకున్న అధికారాలను ఈ చట్టసవరణ లాగేసుకున్నదని ధర్మాసనం 3:2 మెజార్టీ తీర్పులో అభిప్రాయపడింది. అయితే ఈ సవరణ సమాఖ్య విధానంపై ప్రభావం చూపబోదని, అలాగే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కూడా ఇది ఉల్లంఘించలేదని ధర్మాసనం తెలిపింది.
మండల్ తీర్పును సమీక్షించేందుకు కోర్టు నిరాకరించింది. మండల్ తీర్పును వెలువరించే సమయంలో ముగ్గురు జడ్జిలు మాత్రమే 50 శాతం పరిమితి దాటొద్దని చెప్పారని, మిగిలిన ఆరుగురు జడ్జిలు పరిమితి దాటొచ్చని పేర్కొన్నారని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. మండల్ తీర్పును సమీక్షించేందుకు తమకు ఏ కారణం కనిపించడం లేదని పేర్కొన్నది. సాధారణంగా రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్నదే మండల్ తీర్పులో మెజార్టీ అభిప్రాయమని, అసాధారణ పరిస్థితుల్లోనే 50 శాతం దాటొచ్చని ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రజాసేవారంగంలో రిజర్వేషన్ కల్పించడం మాత్రమే ఎస్ఈబీసీల అభ్యున్నతికి మార్గం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఆ రంగంలో ఇప్పటికే మరాఠాలకు తగిన ప్రాతినిధ్యం ఉన్నదని, ఓపెన్ క్యాటగిరీలో వారు 33.12 శాతం ఉద్యోగాలు కైవసం చేసుకుంటున్నారని పేర్కొన్నది. మరోవైపు, కొత్తగా ఎస్ఈబీసీ జాబితాను ప్రకటించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటివరకు ప్రస్తుతమున్న జాబితానే కొనసాగుతుందని పేర్కొన్నది. 2018లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లను హైకోర్టు సమర్థించింది. అయితే కోటాను విద్యాసంస్థల్లో ప్రవేశాలకు 12%, ఉద్యోగాల్లో 13 శాతానికి తగ్గించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై పలు దఫాలుగా విచారించిన ధర్మాసనం తాజాగా తుది తీర్పును ప్రకటించింది.
మరాఠా కోటాను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విచారం వ్యక్తంచేశారు. ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాల్లో వ్యవహరించిన మాదిరిగానే కేంద్రం తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానన్నారు. మరాఠా కోటాపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్కు విజ్ఞప్తిచేశారు.