జల్నా, సెప్టెంబర్ 1: మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం జరిగిన మరాఠా రిజర్వేషన్ల ఆందోళన హింసాత్మకంగా మారింది. ఘర్షణల్లో 20 మంది ఆందోళనకారులతో పాటు 12 మంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో జల్నా జిల్లా అంబాద్ తహశీల్ పరిధిలోని అంతర్వాలి సరతి గ్రామంలో మనోజ్ జరంగే నేతృత్వంలో ఆందోళనకారులు మంగళవారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తున్నది. కొంత మంది ట్రాన్స్పోర్టు బస్సులు, ప్రైవేటు వాహనాలను లక్ష్యంగా చేసుకొన్నారని, రాళ్లు కూడా విసిరారని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు టియర్గ్యాస్ ప్రయోగించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే దీన్ని అధికారులు ధ్రువీకరించలేదు. శాంతి పాటించాలని సీఎం ఏక్నాథ్ షిండే పిలుపునిచ్చారు. హింసపై ఉన్నతస్థాయి విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
విపక్షాల ఖండన
తాజా హింసాత్మక ఘటనలను ప్రతిపక్షాలు ఖండించాయి. మరాఠాలను రిజర్వేషన్లు కల్పించేందుకు బీజేపీ-శివసేన(షిండే వర్గం) ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఏంటో చెప్పాలని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జిని శివసేన(యూబీటీ) నేత అంబదాస్ ధన్వే ఖండించారు.