Millionaires | న్యూఢిల్లీ, జూన్ 16: మన దేశ సంపన్నుల్లోని చాలామంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలసపోతున్నారు. 2023లో ఇప్పటికే 6,500 మంది సంపన్నులు దేశం విడిచి వెళ్లిపోయారు. 2022లో మొత్తం 7,500 మంది విదేశాల్లో స్థిరపడ్డారు. ఈ వలసలకు కారణం మనదేశంలో ఆదాయం పన్ను అధికంగా ఉండటమేనని కొందరు చెప్తున్నారు. కానీ, అది నిజం కాదని తేలింది. భారతీయ సంపన్నులు అధికంగా చేరుకొంటున్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో పన్నులు మనతో పోల్చుకొంటే భారీగా ఉన్నాయి.
మనదేశంలో వ్యక్తిగత ఆదాయం పన్ను 30 శాతం ఉన్నది. అదే కెనడాలో 54 శాతం, అమెరికాలో 51.6 శాతం, ఆస్ట్రేలియాలో 45 శాతం ఉన్నది. అయినా మన సంపన్నులు అక్కడికే వెళ్తున్నారు. జీ-20 గ్రూపులోని దాదాపు 15 దేశాలకంటే కూడా మనదేశంలోనే పన్ను తక్కువగా ఉన్నదని కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ టాక్సేషన్ ఫర్ ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ డైరెక్టర్ ఓం రాజ్పురోహిత్ తెలిపారు. బ్రిక్స్లోని ఐదు దేశాలతో పోల్చినా భారత్లో పన్ను తక్కువగానే ఉన్నది. అయితే, మనదేశంలో వ్యక్తిగత ఆదాయం పన్ను తక్కువగా ఉన్నప్పటికీ, కార్పొరేట్ పన్ను మాత్రం భారీగా ఉన్నది. దీనికి తోడు సర్చార్జీలు, సెస్సులు కూడా భారీగానే ఉన్నాయి. మొత్తం పన్నుపై ఈ చార్జీలే 25 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నది.
భద్రతే సమస్యా?
మనదేశంలో గత పదేండ్లుగా ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణగదొక్కటం ఎక్కువైందని అనేక నివేదికలు తేల్చాయి. ఏదైనా అంశంపై స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పే పరిస్థితులు లేవు. ఏం మాట్లాడినా ఎక్కడి నుంచి ఎవరు దాడులు చేస్తారోనన్న భయం ప్రజల్లో నెలకొన్నది. ఇక ధనవంతుల్లో ఈ భయాలు కొంచెం ఎక్కువే ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వానికి ఏదైనా సలహా ఇద్దామన్నా.. మాకే నీతులు చెప్తారా? అని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి వ్యాపారాలను, పరిశ్రమలను ఛిన్నాభిన్నం చేసే దారుణాలు చోటుచేసుకొంటున్నాయి. కర్ణాటకలో కాఫీడే వ్యవస్థాపకుడి ఆత్మహత్య ఈ దారుణాలకు పరాకాష్టగా నిలిచింది.