బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల మధ్య వేడి రాజుకుంటున్నది. అన్ని పార్టీల నేతలు వ్యూహా ప్రతివ్యూహాల రచనలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎదుటి పార్టీల్లోని ప్రజాబలం ఉన్న నేతలను తమ పార్టీల్లోకి లాగేందుకు పావులు కదుపుతున్నారు. అదేవిధంగా అవతలి పార్టీల నుంచి స్వచ్ఛందంగా వచ్చే నాయకుల కోసం కూడా తలుపులు బార్లా తెరచి ఉంచారు.
ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ (ఎస్) పార్టీ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి.. రేపు తమ పార్టీలోకి చాలా మంది నేతలు రాబోతున్నారని ప్రకటించారు. బీజేపీ నేత దొడ్డప్ప గౌడ పాటిల్ నరిబోల్ చేరిక దాదాపు ఖాయమైపోయిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తర కర్ణాటక నుంచే తాము 30 నుంచి 40 స్థానాల్లో గెలువబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులకు సంబంధించి తాము ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేశామని, రేపు రెండో జాబితాను విడుదల చేయబోతున్నామని కుమారస్వామి తెలిపారు. కాగా, వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి..