రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిభవ్ కుమార్ను కాపాడేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. కేజ్రీవాల్ కుయుక్తులు చూస్తుంటే ఆయన కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగిందని వెల్లడవుతోందని ఆరోపించారు. కేజ్రీవాల్ తన నివాసంలో ఓ మహిళ పట్ల దురుసుగా వ్యవహరించిన వ్యక్తిని కాపాడేందుకు నిరసనలు చేపట్టడం శోచనీయమని అన్నారు. బిభవ్ కుమార్కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని మనోజ్ తివారీ ప్రశ్నించారు.
అసలు అతడిని కాపాడేందుకు కేజ్రీవాల్ ఎందుకు ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. బిభవ్ కుమార్ మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని, సీసీటీవీ ఫుటేజ్ను ధ్వంసం చేశారని ఆప్ నేతలు ఇంతటి కుట్రకు తెగబడ్డారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్ ఆదివారం ఆరోపించారు. డైరీలో రాసిన అంశాల విషయంలో గోప్యత పాటించాల్సి ఉన్నా ఆప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాటిని ఢిల్లీ పోలీసులు బహిర్గతం చేస్తున్నారని అన్నారు.
తొలి రోజు నుంచీ ఢిల్లీ పోలీసులు ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల్లో లబ్ధి చేకూరేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసాల నుంచి ప్రవేశ, నిష్క్రమణల వద్ద సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్ను ఢిల్లీ పోలీసులు తీసుకెళ్లారని మంత్రి వివరించారు. దర్యాప్తు ఏజెన్సీలు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :