న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో ఎదురైన భద్రతా లోపం సున్నితమైన వ్యవహారమని ఇది రాజకీయ ఫుట్బాల్ అంశం కాదని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ప్రధాని పర్యటనలో భద్రతా లోపం ఉంటే బాధ్యుల్ని గుర్తించాలని సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ చేపట్టాలని తివారీ స్పష్టం చేశారు.
దేశ ప్రధాని భద్రత విషయంలో ఇది తీవ్రమైన భద్రతా వైఫల్యమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లలో లోటుపాట్లు ఉంటే పార్లమెంట్లో ఆమోదించిన ఎస్పీజీ చట్టం ఉందని తివారీ గుర్తుచేస్తూ ఈ వ్యవహారంపై సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ నిర్వహించాలని అసలు ఇది పొలిటికల్ ఫుట్బాల్ వ్యవహారం కాదని వ్యాఖ్యానించారు.
ప్రధాని భద్రత అంశం సాయుధ బలగాలుగా అభివర్ణించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) పర్యవేక్షిస్తుంది. ఇక పంజాబ్లో రైతుల నిరసనతో ప్రధాని కాన్వాయ్ ఫిరోజ్పూర్ సమీపంలోని ఫ్లైఓవర్పై దాదాపు 20 నిమిషాలు నిలిచిపోవడం కలకలం రేపింది. దీంతో ర్యాలీ సహా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండానే ప్రధాని నరేంద్ర మోదీ వెనుతిరిగారు.