కాంగ్రెస్ సీనియర్లకు అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. పంజాబ్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి సీనియర్ నేత, ఎంపీ మనీశ్ తివారీ, సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పేరును తొలగించింది. మొదట్లో మాజీ ప్రధాని మన్మోహన్, సోనియా, రాహుల్తో పాటు ఆజాద్, మనీశ్ తివారీ పేర్లను అధిష్ఠానం ప్రకటించింది. తాజాగా గులాంనబీ, మనీశ్ తివారీ పేర్లను తొలగిస్తూ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మనీశ్ తివారీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ఈ నిర్ణయం వేరే విధంగా ఉంటే ఆశ్చర్యపోయేవాడ్ని. దీని వెనుక ఉన్న రహస్యమేమిటో మీ అందరికీ విదితమే’ అంటూ మనీశ్ ట్వీట్ చేశారు. ఇక మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా కాంగ్రెస్ నిర్ణయంపై మండిపడ్డారు. సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పని, సంకుచిత నిర్ణయాలతో కాంగ్రెస్ గెలవలేదని అభిజిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు.