న్యూఢిల్లీ : కరోనా కేసుల పెరుగుదలతో సతమతమవుతున్న ఢిల్లీకి రోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేంద్ర ప్రభుత్వాన్ని శనివారం అభ్యర్ధించారు. దేశ రాజధానికి శుక్రవారం కేవలం 487 మెట్రిక్ టన్నలు ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మే 5న తొలిసారి అత్యధికంగా 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేయగా మే 6న మళ్లీ 577 మెట్రిక్ టన్నులు, మే 7న కేవలం 487 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేశారని చెప్పారు.
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఢిల్లీకి నిత్యం 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయింపులను కొనసాగించాలని మనీష్ సిసోడియా కేంద్రాన్ని కోరారు. తాము పడకల సంఖ్య పెంచితే రోజుకు 976 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందని చెప్పారు. ఇక ఢిల్లీలో గత 24 గంటల్లో 17,346 తాజా కేసులు వెలుగు చూడగా 332 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.