న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఆప్ నేతలపై మరిన్ని తప్పుడు కేసులు బనాయిస్తారని దుయ్యబట్టారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన మద్యం విధానంపై సీబీఐ దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా సిఫార్సు చేసిన నేపధ్యంలో సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ మోసపూరిత హామీల భ్రమల నుంచి బయటపడిన ప్రజలకు కేజ్రీవాల్ ఆశాకిరణంలా కనిపిస్తున్నారని కేజ్రీవాల్ ప్రభావం పెరుగుతుండటంతో ప్రధాని మోదీకి భయం పట్టుకుందని, ఆప్ నేతలపై భవిష్యత్లో పలు తప్పుడు కేసులు బనాయిస్తారని సిసోడియా ట్వీట్ చేశారు.
అయితే కేజ్రీవాల్, ఆప్ను జైళ్లు అడ్డుకోలేవని వ్యాఖ్యానించారు. కాగా, వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నివేదిక ఆధారంగా ఎల్జీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.టెండర్లు ఖరారైన తర్వాత లిక్కర్ లైసెన్సుల మంజూరులో అనుచిత లబ్ధి చేకూర్చడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడిందని కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
2021-22లో లిక్కర్ లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాలు వర్తింపచేయడంలో నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లకు పంపిన నివేదిక అనంతరం ఎల్జీ మద్యం పాలసీపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఎక్సైజ్ శాఖకు ఇన్చార్జ్ మంత్రిగా మనీష్ సిసోడియా వ్యవహరించిన క్రమంలో ఉన్నత రాజకీయ స్ధాయిలో నిబంధనలను ఉల్లంఘిస్తూ నోటిఫైడ్ ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని నివేదిక పేర్కొంది.