న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడిని ఆప్ తీవ్రంగా ఖండించింది. అరవింద్ కేజ్రీవాల్ను హత్య చేసేందుకు కాషాయ పార్టీ కుట్ర పన్నిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా ఆరోపించారు. ఎంపీ తేజస్వి సూర్య నేతృత్వంలో కాషాయ పార్టీ కార్యకర్తలు అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద బుధవారం ప్రదర్శన చేపట్టారు. కశ్మీర్ ఫైల్స్ మూవీలో చూపిన కశ్మీర్ పండిట్ల ఊచకోత అవాస్తవమని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.
కేజ్రీవాల్ ఇంటి ఎదుట నిరసనకు దిగిన ఆ పార్టీ కార్యకర్తలు కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఢిల్లీ పోలీసుల సమక్షంలోనే ఇవాళ బీజేపీ గూండాలు సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని హింసకు పాల్పడ్డాయని సిసోడియా పేర్కొన్నారు. కాషాయ గూండాలు సెక్యూరిటీ బారికేడ్లను పగులగొట్టారని, సీసీటీవీలను ధ్వంసం చేశారని పోలీసుల కండ్ల ముందే ఇవన్నీ జరిగాయని అన్నారు. కేజ్రీవాల్పై దాడి చేసేందుకు ముందస్తు ప్రణాళికతోనే దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.
ఇక సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అంతమొందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్ ఆరోపించారు. గతంలోనూ కేజ్రీవాల్పై కాషాయ పార్టీ దాడులకు తెగబడిందని గుర్తుచేశారు. ఏదో సాకుతో కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పంజాబ్లో ఆప్ విజయంతో బెంబేలెత్తిన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులతో కుమ్మక్కై ముఖ్యమంత్రిపై దాడులకు కుట్రపన్నుతోందని ఆరోపించారు.