న్యూఢిల్లీ : బీజేపీ ప్రలోభాలకు లొంగి ఆప్ ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేయరని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కాషాయ పార్టీని హెచ్చరించారు. బీజేపీలో చేరితే రూ 20 కోట్లు ఇస్తామని నలుగురు ఆప్ ఎమ్మెల్యేలకు కాషాయ పార్టీ ఆఫర్ చేసిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించిన క్రమంలో సిసోడియా స్పందించారు.
తనను ఆప్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు విఫలయత్నం చేసిన బీజేపీ ఆపై తమ ఎమ్మెల్యేలకు రూ 20 కోట్లు ఆఫర్ చేసిందని, ఈడీ, సీబీఐలతో బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. ఆప్ను చీల్చేందుకు బీజేపీ తాజా కుట్రకు తెరలేపిందని అన్నారు. బీజేపీ ఇలాంటి పనులకు దూరంగా ఉంటే మంచిదని మనీష్ సిసోడియా హితవు పలికారు.
తాము అరవింద్ కేజ్రీవాల్ మనుషులమని, భగత్ సింగ్ బాటలో నడిచేవారమని స్పష్టం చేశారు. తాము ప్రాణాలైనా వదులుతాము కానీ పార్టీకి ద్రోహం చేయబోమని పేర్కొన్నారు. తమ ముందు ఈడీ, సీబీఐ తోకముడవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఆప్ ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమ్నాధ్ భారతి, కుల్దీప్లను సంప్రదించిన బీజేపీ వారందరూ పార్టీ మారితే రూ 20 కోట్ల ఇస్తామని ఆఫర్ చేసిందని, పార్టీ మారకుంటే ఈడీ, సీబీఐలను ఎదుర్కోవాల్సిఉంటుందని వారిని బెదిరించిందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.