న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలెత్తిన కాషాయ పార్టీ హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ స్ధానంలో అనురాగ్ ఠాకూర్కు పాలనా పగ్గాలు అప్పగించనుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ బుధవారం హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లగా అక్కడి ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిందని చెప్పారు.
ఆప్కు ప్రజల్లో ఆదరణను చూసి బెంబేలెత్తిన కాషాయ పార్టీ సీఎంను మార్చేందుకు ప్రయత్నిస్తోందని సిసోడియా వ్యాఖ్యానించారు. నాలుగున్నరేండ్ల జైరాం ఠాకూర్ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు అనురాగ్ ఠాకూర్కు హిమాచల్ సీఎం పదవి కట్టబెడుతున్నారని తమకు సమాచారం అందిందని చెప్పారు. సిసోడియా వ్యాఖ్యలను జైరాం ఠాకూర్ తోసిపుచ్చారు.
ఇక హమీర్పూర్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కేంద్ర క్రీడలు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. అనురాగ్ ఠాకూర్ తండ్రి ప్రేం కుమార్ ధుమల్ హిమాచల్ ప్రదేశ్ సీఎంగా గతంలో వ్యవహరించారు. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ , కాంగ్రెస్ తలపడుతుండగా కాంగ్రెస్ స్ధానంలో బలపడేందుకు ఆప్ సన్నాహాలు చేపట్టింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడంతో ఆప్ ఇతర రాష్ట్రాల్లోనూ మెరుగైన సామర్ధ్యం కనబరచాలని ఉవ్విళ్లూరుతోంది.