న్యూఢిల్లీ : ఎంసీడీ ఎన్నికల్లో అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. పలువురి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని అన్నారు. తమ పేర్లు ఓటర్ల జాబితాలో లేవని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఈ కుట్రపై తాను ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
ఢిల్లీని పరిశుభ్రంగా, అందంగా తయారుచేసుకునేందుకు నగర ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (ఎంసీడీ) పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ 18 శాతం పోలింగ్ నమోదైంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ల విలీనం అనంతరం తొలిసారిగా జరుగుతున్న ఎంసీడీ ఎన్నికల్లో క్లీన్ ఢిల్లీ కోసం ఓటు వేయాలని ఓటర్లను ఆప్ అభ్యర్ధించింది.
ఈ ఎన్నికల్లో 1.45 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1349 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 2017 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 270 వార్డులకు గాను బీజేపీ 181 వార్డుల్లో గెలుపొందింది. ఎంసీడీ ఎన్నికల్లో పాగా వేయాలని ఈసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక ఎంసీడీ ఎన్నికల ఫలితాలను ఈనెల 7న వెల్లడించనున్నారు.