ఇంఫాల్, ఆగస్టు 8: మణిపూర్లో ఒక పక్క జాతుల విద్వేషం కారణంగా హింసాత్మక చర్యలతో అట్టుడుకుతుండగా, మరోవైపు అక్కడ శాంతి భద్రతలు నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్పై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు పోలీసులే అస్సాం రైఫిల్స్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నది. విధి నిర్వహణ నిమిత్తం వెళుతున్న తమను అస్సాం రైఫిల్స్ సిబ్బంది అడ్డుకుని తమను ముందుకు వెళ్లనీయలేదని ఆరోపిస్తూ మణిపూర్ పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్టు 5న ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయుధాలతో ఉన్న కొందరు కుకీ మిలిటెంట్లను పట్టుకోవడానికి బిష్ణుపూర్ జిల్లా క్వాక్తా గోతల్ రోడ్డుపై వెళ్తున్న పోలీసు సిబ్బందిని తొమ్మిది మంది అస్సాం రైఫిల్స్కు చెందిన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాము కూడా శాంతిభద్రతల పర్యవేక్షణ విధుల్లోనే ఉన్నామని చెప్పినా వినకుండా తమ వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పెట్టి ముందుకు వెళ్లనీయలేదని, దీంతో మిలిటెంట్లు తప్పించుకున్నారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
వివరణ
‘మణిపూర్ హింస వెనుక ఆరెస్సెస్’ శీర్షికతో 02-06-2023 తేదీన ‘నమస్తే తెలంగాణ’లో ఒక వార్త ప్రచురితమైంది. అందులో వ్యక్తపరిచిన అంశాలు కేవలం నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్సీఎన్) అభిప్రాయాలు మాత్రమే. మణిపూర్ సంక్షోభం నేపథ్యంలో ఆ సంస్థ చేసిన ఆరోపణలను, డిమాండ్లను మాత్రమే మేం ప్రచురించాం. అంతేతప్ప అవి ‘నమస్తే తెలంగాణ’ తనంత తానుగా వ్యక్తం చేసిన అభిప్రాయాలుగానీ, ఆరోపణలుగానీ, వ్యాఖ్యా నాలుగానీ ఎంత మాత్రం కావు. నాగా మండలి అభిప్రాయాలతో మా పత్రికకు ఎటువంటి ఏకీభావం లేదని స్పష్టం చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్పై ఎన్ఎస్సీఎన్ సంస్థ చేసిన ఆరోపణలు మా పత్రిక అభిప్రాయంగా ఎవరికైనా తప్పుడు సంకేతం కలిగించి ఉంటే అందుకు చింతిస్తున్నాం.
–ఎడిటర్