ఇంపాల్ : మణిపూర్లోని నోనీ జిల్లాలో టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కు పెరిగిందని అధికారులు శనివారం తెలిపారు. మృతుల్లో 18 మంది జవాన్లు ఉన్నారని, ఇప్పటి వరకు టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 13 మంది సిబ్బంది, ఐదుగురు పౌరులు రక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంకా 38 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు పేర్కొన్నారు. తూపుల్ యార్డు రైల్వే నిర్మాణ ప్రాంతానికి సమీపంలోని టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి.
శిథిలాల కింద ఇంకా చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు భారత సైన్యం, అసోం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ, కేంద్ర, రాష్ట్ర విపత్తు దళాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వర్షాలతో పాటు ఇతర కారణాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నది. మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్, ఆర్మీ, సివిల్ అధికారులతో కలిసి శుక్రవారం విపత్తు ప్రదేశాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం ప్రకటించారు. ఈ ఘటనలో బెంగాల్కు చెందిన తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.