ఇంఫాల్: మణిపూర్ ప్రజలకు భరోసా కల్పించడంలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో కుకీ, మైతీ తెగల ప్రజల మధ్య కొనసాగుతున్న అనుమానాలు ఉద్రిక్తతలకు, పరస్పర దాడులకు దారి తీస్తున్నాయి. రాష్ట్రంలో కాల్పుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. కుకీ తెగ ప్రజలు కొండల నుంచి కిందకు వచ్చి తమ ఇండ్లను తగులబెడుతున్నారని మైతీ తెగవారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను కుకీ తెగ ప్రజలు ఖండిస్తున్నారు. కుకీ మిలిటెంట్లు, కేంద్రం, రాష్ట్రం మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఉన్నదని, దాని ప్రకారం మిలిటెంట్ల దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఉన్నదని చెప్పారు. ఇప్పటివరకు దుండుగులు 200 చర్చిలకు నిప్పు పెట్టారని జేసన్ అనే పాస్టర్ వెల్లడించారు. సైన్యం, పోలీసులు తమకు సరైన రక్షణ కల్పిస్తారన్న నమ్మకం లేదని రెండు తెగల ప్రజలు అభిప్రాయపడ్డారు. మరోవైపు దవాఖానలు గాయపడ్డవారితో నిండిపోతున్నాయి. మందుల కొరత ఎదుర్కొంటున్నామని వైద్యులు తెలిపారు. ఘర్షణల్లో గాయడినవారికి చురచంద్పూర్ జిల్లా దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ఘర్షణల నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రమంతటా నిత్యావసరాల కొరత వేధిస్తున్నది. ఏటీఎంలలో డబ్బులు అయిపోయాయి. ఇప్పటిదాకా ఒక్క ప్రభుత్వ ప్రతినిధి కూడా తమ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని చురచంద్పూర్లోని పునరావాస శిబిరంలో ఆశ్రయం పొందుతున్న ఒక మహిళ వాపోయారు. మిలిటెంట్లు అమాయకులను ఆత్మాహుతి దళాలుగా వాడుకొంటున్నారని సైన్యం వెల్లడించింది.