BJP | న్యూఢిల్లీ: ప్రజా సమస్యలను గాలికొదిలేసి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీకి దేశవ్యాప్తంగా ఇంటాబయటా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటు ప్రజల నుంచి.. అటు సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సొంత పార్టీ నేతలే విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మధ్యప్రదేశ్లో ఎంపీలు, కేంద్రమంత్రులను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు రాజీనామాలకు దిగారు. ప్రభుత్వం, పార్టీపై ఇంత భారీ స్థాయిలో వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదని మణిపూర్ బీజేపీ చీఫ్ సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. మరోవైపు యోగీ సర్కార్పై ఆ పార్టీ నేత వరుణ్గాంధీ విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న త్రిపురలో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో రానున్న ఐదు రాష్ర్టాలు, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఎన్నికలకు వెళితే.. ఓటమి ఖాయమని ముందే తెలుసుకున్న ఆ పార్టీ ఏకంగా రాష్ట్ర సీఎంనే పక్కనపెట్టింది. కేంద్రమంత్రులు, ఎంపీలను బరిలోకి దించాలని బీజేపీ ప్రణాళికలు రచించింది. అయితే ఈ ప్లాన్ కూడా బెడిసికొట్టింది. ఇప్పటివరకు తమకే సీట్లు ఇస్తారని భావించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సహా 40 మంది నేతలు బీజేపీకి గుడ్బై చెప్పారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వంపై సొంత పార్టీ ఎంపీ వరుణ్గాంధీ విమర్శలు గుప్పించారు. ఒకరి పేరుపైన ఆగ్రహంతో లక్షలాదీ మంది కడుపు కొట్టవద్దని యోగీ సర్కార్ను దుయ్యబట్టారు. ఆమేథీలోని సంజయ్గాంధీ దవాఖాన లైసెన్స్ రద్దు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘మానవత్వంతో మాత్రమే ఇబ్బందుల్లో ఉన్నవారికి న్యాయం జరుగుతుంది. దురహంకారంతో కాదు’ అని పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరపకుండానే లైసెన్స్ను రద్దు చేశారని డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్కు ఆయన లేఖ రాశారు.
బీజేపీ పాలిత త్రిపుర సర్కార్ ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నది. గిరిజనుల ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రతిపక్ష తిప్రా మోతా ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించారు. రహదారులు, రైల్వే ట్రాక్లను దిగ్బంధం చేశారు.
ఇంఫాల్: మణిపూర్లో హింసను అరికట్టడంలో, శాంతి భద్రతలను పరిరక్షించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సాక్ష్యాత్తూ మణిపూర్ బీజేపీ శాఖ ఈ వాస్తవాన్ని అంగీకరించింది. హింసను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, సర్కార్ పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొన్నదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమవుతున్నాయని మణిపూర్ బీజేపీ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసింది. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఏ శారదా దేవితో సహా ఎనిమిది మంది ఆఫీస్ బేరర్లు సంతకాలు చేశారు. మరోవైపు అధికార పార్టీపై ఈ స్థాయిలో ఆగ్రహం, ప్రజా వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదని మణిపూర్ బీజేపీ చీఫ్ శారదా దేవి పేర్కొన్నారు.