న్యూఢిల్లీ : ప్రజల దృష్టిలో సీబీఐ విశ్వసనీయత ప్రశ్నార్ధకమవడంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ శనివారం ఆరోపించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీబీఐని తన కనుసన్నల్లో నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. సీజేఐ రమణ వ్యాఖ్యలను ఆలకించాలని ఆయన అమిత్ షాకు సూచించారు. ప్రధాన న్యాయమూర్తి వాస్తవాలు మాట్లాడారని, అమిత్ షా సీబీఐని గుప్పిట్లో పెట్టుకున్నారు..సీబీఐ స్వతంత్రతను కోల్పోయిందని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. సీబీఐ, ఈడీలను మోదీ సర్కార్ దుర్వినియోగపరుస్తోందని దుయ్యబట్టారు.
కొన్ని కేసుల్లో సీబీఐ చర్యలు, నిష్క్రియాపరత్వంతో ప్రజలు దర్యాప్తు ఏజెన్సీ విశ్వసనీయత ప్రజల్లో ప్రశ్నార్ధకమవుతుందని శుక్రవారం సీజేఐ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా వినాలని పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ డీపీ కోహ్లి మెమోరియల్ లెక్చర్ కార్యక్రమంలో మాట్లాడుతూ సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ, ఈడీ వంటి దర్యాప్తు సంస్దలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని స్పష్టం చేశారు.