శబరిమల, డిసెంబర్ 27: స్వామియే శరణం అయ్యప్ప అంటూ వేలాది మంది భక్తుల ఘోష మధ్య బుధవారం కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామికి ఘనంగా మండల పూజ నిర్వహించారు. 41 రోజుల పాటు సాగిన వార్షిక తీర్థ యాత్ర మొదటి విడత ముగింపునకు గుర్తింపుగా కొండపై మంగళకరంగా మండల పూజను నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఇక్కడ ప్రసిద్ధి చెందిన అయ్యప్ప ఆలయంలో ప్రార్థనలు చేశారు. ప్రధాన పూజారి కందర్ మహేష్ మోహన్ అయ్యప్ప స్వామిని ఘనంగా అలంకరించి, పవిత్రమైన బంగారు వస్ర్తాన్ని కప్పిన అనంతరం ఊరేగింపుగా మంగళవారం సాయంత్రం సన్నిధానానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి కలశాభిషేకం, కలభంహిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. మండల పూజ ముగిసిన వెంటనే పూజా కార్యక్రమాలను నిర్వహించి గుడిని మూసివేస్తారు. తిరిగి మూడు రోజుల తర్వాత ఈ నెల 30న మకర జ్యోతి కోసం తెరుస్తారు.