సిమ్లా: పర్యాటకులు మాస్క్లు ధరించకపోతే రూ.5,000 జరిమానా లేదా 8 రోజులు జైలు శిక్ష విధిస్తామని హిమాచల్ ప్రదేశ్లోని మనాలి అధికారులు హెచ్చరించారు. గత వారం రోజుల్లో 300కుపైగా చలానాలు విధించి జరిమానా కింద రూ.3 లక్షలు వసూలు చేసినట్లు కులు ఎస్పీ గురుదేశ్ శర్మ తెలిపారు.
ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. నెల రోజుల లోపు సుమారు ఏడు లక్షల మంది పర్యాటకులు రాష్ట్రంలోని సిమ్లా, మనాలి వంటి హిల్ స్టేషన్లకు పోటెతారు. మనాలి, ముస్సూరీ, సదర్ బజార్ ఢిల్లీ, సిమ్లా, లక్ష్మీ నగర్ ఢిల్లీ, దాదర్ మార్కెట్లు వద్ద పర్యాటకుల సందడి కనిపించింది. జనం మాస్కులు లేకుండా తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
మరోవైపు పర్యాటకుల రద్దీ, కరోనా నిబంధనల ఉల్లంఘనపై కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పర్యాటకుల రద్దీని నియంత్రించడంతోపాటు, కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మాస్కులు ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు.