కోల్కతా : మూడంచెల భద్రతను తప్పించుకుని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించి పట్టుబడిన వ్యక్తి ఉదంతంపై దర్యాప్తులో షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈనెల 3న భద్రతాధికారుల కండ్లు కప్పి దీదీ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడిని హఫీజుల్ మొల్లాగా గుర్తించారు. సీఎం నివాస ప్రాంగణంలో అరెస్టయిన హపీజుల్ చేతిలో ఇనుప రాడ్ను పోలీసులు కనుగొన్నారు.
దీదీ నివాస ప్రాంగణంలోనే రాత్రంతా గడిపిన నిందితుడిని మరుసటి రోజు ఉదయం గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకుని కాళీఘాట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. 11 సిమ్ కార్డులు కలిగి ఉన్న నిందితుడు బంగ్లాదేశ్, జార్ఖండ్, బిహార్కు చెందిన పలు నెంబర్లకు ఫోన్ చేసినట్టు గుర్తించారు. గత ఏడాది సరైన పత్రాలు లేకుండానే నిందితుడు బంగ్లాదేశ్ సందర్శించాడని వెల్లడైంది. ఈ ఘటన అనంతరం సీనియర్ పోలీస్ అధికారుల పోస్టింగ్ల్లో కోల్కతా అధికార యంత్రాంగం పలు మార్పులు చేపట్టింది.