Punjab : పంజాబ్లో దారుణం జరిగింది. వివాహిత మహిళతో సంబంధం కలిగి ఉన్నందుకు ఒక యువకుడిని కొట్టి చంపారు ఆమె తరఫు కుటుంబ సభ్యులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసులు, బాధిత యువకుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్లోని మాన్సా జిల్లా, ఖోకర్ రోడ్కు చెందిన జషన్దీప్ సింగ్ (25) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన వివాహిత మహిళతో సంబంధం కలిగి ఉన్నాడు.
ఆ మహిళకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారి మధ్య సంబంధంపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల నలుగురైదుగురు మగవారు, ఇద్దరు మహిళలు బొలెరో వాహనంలో వచ్చారు. అతడిని లాక్కెళ్లి, చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. విచక్షణా రహితంగా కొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు, చేతుల ఎముకలు విరిగిపోయాయి. జషన్దీప్ సింగ్ను తీవ్రంగా కొట్టిన అనంతరం నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే ఆ యువకుడి కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ జషన్దీప్ సింగ్ మరణించాడు. దీనిపై అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి, తండ్రి కోరారు.
ఈ అంశంపై వారు మాట్లాడుతూ.. తమ కొడుకుపై గతంలో కూడా నిందితులు దాడి చేశారని తెలిపారు. తన కొడుకుకు ఫోన్ చేయవద్దని ఆ వివాహిత మహిళకు తాము పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదని, ఆమె అలా ఫోన్ చేయడం వల్లే ఈ రోజు ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఘటన అనంతరం నిందితులు పరారీలో ఉన్నారు.