రాంచీ: మొబైల్ ఫోన్ దొంగిలించాడన్న అనుమానంతో ఒక వ్యక్తి తన స్నేహితుడిపై కాల్పులు జరిపాడు. (Man Shoots Friend) తీవ్రంగా గాయపడిన అతడు మరణించాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఈ సంఘటన జరిగింది. రాణికుదర్ ప్రాంతంలో నివసించే అభిషేక్ లాల్ మొబైల్ ఫోన్ కనిపించలేదు. దీంతో 25 ఏళ్ల స్నేహితుడు విశాల్ ప్రసాద్పై అతడు అనుమానం వ్యక్తం చేశాడు. శనివారం ఉదయం స్నేహితుడి ఇంటికి వెళ్లి తన మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని అడిగాడు. అయితే తాను చోరీ చేయలేదని నచ్చజెప్పేందుకు విశాల్ ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, శనివారం రాత్రి విశాల్ను అభిషేక్ పిలిచాడు. రాందాస్ భట్టా ప్రాంతానికి స్నేహితుడ్ని తీసుకెళ్లాడు. వెంట తెచ్చిన తుపాకీతో విశాల్ ఛాతిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కాల్పుల్లో గాయపడిన విశాల్ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా అతడు మరణించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అభిషేక్ను అరెస్ట్ చేసేందుకు అతడి కోసం వెతుకుతున్నారు.