బెంగళూరు: కర్ణాటకలోని దేవనగెరె జిల్లాలో దారుణం జరిగింది. పెండ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు తన ప్రియురాలిని అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. పట్టపగలు నడిరోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానా అనే యువతి, చాంద్ పీర్ అలియాస్ సాదత్ అనే యువకుడు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే, చాంద్ పీర్ పెండ్లి ప్రస్తావన తీసుకురాగా సుల్తానా అందుకు నిరాకరించింది. దాంతో చాంద్ పీర్ సుల్తానా కుటుంబసభ్యులను కలిసి తాను ఆమెను పెండ్లి చేసుకుంటాననే ప్రతిపాదన చేశాడు. చాంద్ ప్రతిపాదనను సుల్తానా కుటుంబం కూడా తిరస్కరించింది. దాంతో చాంద్ పీర్.. సుల్తానాపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో ఇటీవల సుల్తానాకు మరో యువకుడితో పెండ్లి నిశ్చయం చేశారు. విషయం తెలుసుకున్న చాంద్ పీర్ మాట్లాడుకుందాం రమ్మని యువతిని బయటికి పిలిచాడు. స్కూటీపై వచ్చిన యువతితో మాట్లాడుతూనే వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం అక్కడి కొంత దూరం బైకుపై వెళ్లి విషం తాగి పడిపోయాడు.
ఇది గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సుల్తానా అప్పటికే మరణించినట్లు చెప్పారు. చాంద్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.