న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన కుమారుడ్ని ఇంటికి తీసుకువచ్చేందుకు స్కూల్కు వెళ్లాడు. అయితే ఆ స్కూల్ వద్ద ఉన్న ఆవు అతడిపై దాడి చేసింది. కింద పడిన ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి, కాళ్లతో తొక్కి చంపింది. (Delhi Man Stomped By Bull) అక్కడున్న వారు ఆ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 22న 42 ఏళ్ల సుభాష్ కుమార్ ఝా తన పెద్ద కుమారుడ్ని ఇంటికి తెచ్చేందుకు అతడు చదువుతున్న స్కూల్కు వెళ్లాడు.
కాగా, ఢిల్లీలోని కల్కాజీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఉన్న సెయింట్ జార్జ్ స్కూల్ నుంచి కుమారుడ్ని సుభాష్ పికప్ చేసుకున్నాడు. స్కూల్ నుంచి వెళ్లబోతుండగా బయట ఉన్న పశువులు అతడిపై దాడి చేశాయి. కింద పడిన సుభాష్ను ఒక ఆవు కొమ్ములతో పొడిచింది. ముఖం, ఛాతిపై కాళ్లతో తొక్కింది. ఇది చూసి అతడి కుమారుడు సహాయం కోసం కేకలు వేశాడు.
మరోవైపు ఆవు దాడి నుంచి సుభాష్ను కాపాడేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీహార్కు చెందిన సుభాష్ కుమార్ ఢిల్లీలో లోన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు చెప్పారు.