భువనేశ్వర్: ఒక వ్యక్తి మావోయిస్ట్ పేరుతో తండ్రిని బెదిరించాడు. రూ.35 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బు ఇవ్వకపోతే కుటుంబాన్ని అంతం చేస్తామంటూ బెదిరింపు లేఖ పంపాడు. (Son Poses As Maoist) దర్యాప్తు చేసిన పోలీసులు మావోయిస్ట్ పేరుతో తండ్రిని కుమారుడే బెదిరించినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. ఒడిశాలోని కలహండి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నార్లా పట్టణానికి చెందిన దినేష్ అగర్వాల్ ఆ ప్రాంతంలో ప్రసిద్ధ కాంట్రాక్టర్. అక్టోబర్ 6న మావోయిస్ట్ల పేరుతో రాసిన లేఖ ఆయన కారులో కనిపించింది. రూ.35 లక్షలు ఇవ్వాలని లేకపోతే ఆయన కుటుంబాన్ని అంతం చేస్తామని అందులో బెదిరించారు.
కాగా, దినేష్ అగర్వాల్పై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన వ్యాపార భాగస్వామికి కూడా ఇదే బెదిరింపు లేఖ అందింది. దీంతో ఆందోళన చెందిన దినేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
మరోవైపు ఆ బెదిరింపు లేఖను పోలీసులు పరిశీలించారు. చేతి రాతతో హిందీలో రాసిన ఆ లేఖలోని విషయాలు అపరిపక్వంగా కనిపించాయి. మావోయిస్టు క్యాడర్ పేర్లు కూడా తప్పుగా ఉన్నాయి. అలాగే దినేష్ కుటుంబానికి వ్యక్తిగత సూచనలు కూడా అందులో చేయడంతో తెలిసిన వ్యక్తి పనిగా పోలీసులు అనుమానించారు.
కాగా, ఒక వ్యక్తి సమాచారం ఆధారంగా దినేష్ కుమారుడైన 24 ఏళ్ల అంకుష్ అగర్వాల్ ఆ లేఖ రాసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఒక సంస్థలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో మావోయిస్టుల పేరుతో తండ్రిని బెదిరించి రూ.35 లక్షలు వసూలు చేసేందుకు ఈ ప్లాన్ వేసినట్లు అంకుష్ ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Employee Flees With Railways’ Rs 70 Lakh | రూ.70 లక్షల రైల్వే డబ్బుతో.. ఉద్యోగి పరార్
Watch: ఏనుగు తోక లాగిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?