రాంచీ: ఓటు వేసేందుకు వెళ్తున్న ఒక వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. అతడ్ని కాళ్లతో తొక్కి చంపింది. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Elephant Trampled Man) గోబర్బాని గ్రామానికి చెందిన 71 ఏళ్ల వృద్ధుడు ఓటు వేసేందుకు శనివారం ఉదయం 6.30 గంటలకు ఇంటి నుంచి బయలు దేరాడు. అటవీ మార్గంలో నడుచుకుంటూ ధోలబెడ పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా ఒక ఏనుగు అతడిపై దాడి చేసింది. కాళ్లతో తొక్కి ఆ వృద్ధుడ్ని చంపింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది మృతుడ్ని 71 ఏళ్ల సురేంద్ర నాథ్గా గుర్తించారు. పోస్ట్మార్టం తర్వాత మృతదేహాన్ని అతడి కుటుంబానికి అప్పగించారు. అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా రూ. 25,000ను అటవీ శాఖ అందజేసినట్లు కుమారుడు తెలిపాడు. మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.