రాయ్పూర్: ఒక వ్యక్తి తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడకు వెళ్లిన అతడు మళ్లీ గొడవపడ్డాడు. జోక్యం చేసుకున్న భార్య చెల్లెళ్లైన ఇద్దరు మరదళ్లను తుపాకీతో కాల్చి చంపాడు. (Man Kills Wife’s 2 Sisters) ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈ సంఘటన జరిగింది. జితేంద్ర వర్మ బౌన్సర్గా పనిచేస్తున్నాడు. భార్య ఖిలేశ్వరితో తరచుగా గొడవపడేవాడు.
కాగా, మంగళవారం భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో భార్య ఖిలేశ్వరి తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రాత్రి 9 గంటల సమయంలో మద్యం సేవించిన జితేంద్ర, మోవా ప్రాంతంలోని అత్త ఇంటికి చేరుకున్నాడు. తన పిల్లలను అప్పగించాలని గొడవపడ్డాడు.
మరోవైపు ఖిలేశ్వరి చెల్లెళ్లైన గీతాంజలి, దుర్గేశ్వరి ఇంటి నుంచి బయటకు వచ్చారు. జిత్రేంద్రకు నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అయితే తమ కుటుంబ గొడవలో మరదళ్ల జోక్యంపై జితేంద్ర ఆగ్రహించాడు. వెంట తెచ్చిన లైసెన్స్ పిస్టల్తో వారిపై కాల్పులు జరిపాడు. నుదుటిపై బుల్లెట్ తగలడంతో గీతాంజలి అక్కడికక్కడే మరణించింది. వీపుపై బుల్లెట్ గాయమైన దుర్గేశ్వరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.
అయితే ఇద్దరు మరదళ్లపై కాల్పుల తర్వాత జితేంద్ర, పాండ్రి పోలీస్ స్టేషన్కు చేరుకుని లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. హత్యకు వినియోగించిన పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.