బెర్హంపూర్: వారికి పెళ్లై మూడు నెలలే అయ్యింది. కలకాలం కలిసుంటామని ఏడడుగులు వేశారు. మరి అంతలోనే ఏమైందో ఏమో.. భార్యను హత్య చేసిన అతడు, తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒడిశాలోని గంజామ్లో జరిగింది.
గంజామ్ జిల్లాలోని సోడక్కు చెందిన లిలి, బిపిన్ గౌడ భార్యాభర్తలు. గత మే 24న వాళ్లిద్దరికి వివాహమయింది. బిపిన్ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున బిపిన్ తన భార్యను గొడ్డలితో నరికివేశాడు. తానూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కాగా, ఇద్దరిని విగతజీవులుగా చూసిన బిపిన్ తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో దొరికిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. హత్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్య, ఆత్మహత్యకు సంబంధించి ఇంకా వివరాలు తెలియరాలేదు. కాగా, కుటుంబ కలహాలతో బిపిన్ తన భార్యను హత్య చేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.