ముంబై: ఒక తండ్రి తన ముగ్గురు పిల్లలను హత్య చేశాడు. వారిని బావిలోకి విసిరి చంపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. అక్కడి నుంచి పారిపోయిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Man Kills Children By Throwing Into Well) మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఛత్రపతి శంభాజీ నగర్లోని కచ్నేర్ గ్రామంలో నివసిస్తున్న సంతోష్ ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. వారంతమైన శనివారం తన ముగ్గురు పిల్లలతో కలిసి డోమెగావ్కు వచ్చాడు. అయితే అతడు మృగంగా మారిపోయాడు. 12 ఏళ్ల కుమారుడు సోహమ్, కుమార్తెలైన 8 ఏళ్ల శివాని, ఏడేళ్ల దిపాలిని బావిలోకి విసిరేశాడు. దీంతో నీట మునిగి వారు మరణించారు.
కాగా, సంతోష్ అనంతరం పోలీసులకు ఫోన్ చేశాడు. పిల్లలను బావిలో పడేసి చంపినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసి పారిపోయాడు. అయితే బావి వద్దకు చేరుకున్న పోలీసులు పిల్లల మృతదేహాలను వెలికితీశారు. వారిని చంపిన సంతోష్ను ఆదివారం అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురు పిల్లలు మరణించిన మొదటి భార్య సంతానమని పోలీసులు తెలిపారు. రెండో పెళ్లి చేసుకున్న సంతోష్ ఆ పిల్లలను ఎందుకు హత్య చేశాడో అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.