లక్నో: ఒక వ్యక్తిని ఇంటికి రప్పించి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని కారులో ఉంచి దహనం చేశారు. (Man Killed, Burned Inside Car) కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తి ప్రియురాలు, ఆమె తల్లిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రియురాలి తండ్రి, ఇతర నిందితుల కోసం వెతుకుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం నిర్జన ప్రదేశంలో పూర్తిగా కాలిపోయిన కారులో కాలిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడ్ని హత్రాస్కు చెందిన పుష్పేంద్ర యాదవ్గా గుర్తించారు. ఆగ్రాలో నివసిస్తున్న అతడు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.
కాగా, ఆగ్రాలోని సికంద్రా ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల డాలీతో పుష్పేంద్ర యాదవ్కు సంబంధం ఉంది. వీరిద్దరు కలిసి ఇంటి నుంచి పారిపోయేందుకు గతంలో ప్రయత్నించారు. అలాగే తమ సంబంధం గురించి చెప్పి డాలీకి వచ్చిన పెళ్లి సంబంధాన్ని పుష్పేంద్ర యాదవ్ చెడగొట్టాడు. దీంతో డాలీ తల్లిదండ్రులు అవధేష్ యాదవ్, భూరి దేవి అతడిపై కక్షగట్టారు. పుష్పేంద్ర యాదవ్ అడ్డు తొలగించేందుకు ప్లాన్ వేశారు. కుమార్తె డాలీ ద్వారా అతడ్ని ఇంటికి రప్పించారు. బంధువులతో కలిసి పుష్పేంద్రను హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని కారులో ఉంచి తగులబెట్టారు.
మరోవైపు దర్యాప్తులో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు డాలీ, ఆమె తల్లి భూరి దేవిని గురువారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అవధేష్ యాదవ్, అతడి సోదరుడు రాజేష్, హత్యకు సహకరించిన ఇతర బంధువుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. కిడ్నాప్, హత్యలతోపాటు డబ్బులు డిమాండ్ చేసే మధురకు చెందిన కిరాతక నేర ముఠా అయిన భురా గ్యాంగ్లో అవధేష్ యాదవ్ కీలక సభ్యుడని పోలీస్ అధికారి వెల్లడించారు.