తిరువనంతపురం: ఒక వ్యక్తి మహిళతో కలిసి స్కూటర్పై ప్రయాణించాడు. హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డుపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాలు ఫొటోలు (Traffic Camera Pics) తీశాయి. ఆ వ్యక్తి నడిపిన స్కూటర్ అతడి భార్యది కావడంతో ఆ ఫొటోలు, చలాన్ ఆమెకు అందాయి. దీంతో అతడు చిక్కుల్లో పడ్డాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. చివరకు ఆ వ్యక్తి అరెస్ట్కు ఇది దారి తీసింది. కేరళలోని ఇడుక్కిలో ఈ సంఘటన జరిగింది. ‘సేఫ్ కేరళ’ ప్రాజెక్ట్లో భాగంగా ఆ రాష్ట్రంలోని రహదారుల్లో అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని ఆ ఫొటోల ద్వారా గుర్తించి చలాన్లు జారీ చేస్తున్నారు.
కాగా, ఏప్రిల్ 25న ఇడుక్కికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి స్కూటర్పై ప్రయాణించాడు. అతడు హెల్మెట్ ధరించకపోవడాన్ని ట్రాఫిక్ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి నడిపిన స్కూటర్ అతడి భార్య పేరుతో రిజిస్టరైంది. దీంతో సంబంధిత ట్రాఫిక్ ఉల్లంఘన ఫొటోలు, చలాన్ను ఆమె మొబైల్ ఫోన్కు పంపారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని అతడి భార్య నిలదీసింది. స్కూటర్ వెనక ఉన్న మహిళ ఎవరని ప్రశ్నించింది. అయితే ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఆమెకు లిఫ్ట్ ఇచ్చానని అతడు చెప్పాడు.
మరోవైపు ఆ వ్యక్తి మాటలను అతడి భార్య నమ్మలేదు. దీంతో ఈ విషయంపై భార్యాభర్తల మధ్య కొన్ని రోజులపాటు గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తనతోపాటు తన పిల్లలను కొట్టాడంటూ భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నెల 5న ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.