న్యూఢిల్లీ: తన పిటిషన్ను కొట్టివేసిన న్యాయమూర్తికి మరణ శిక్ష విధించాలని కోరుతూ ఒక వ్యక్తి హైకోర్టులో (Delhi High Court) పిటిషన్ దాఖలు చేశాడు. పరిశీలించిన ధర్మాసనం, న్యాయమూర్తిని కించపరచడంతోపాటు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఆ వ్యక్తికి ఆరు నెలలు జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో ఏడు రోజులు జైల్లో ఉంచాలని ఆదేశించింది. పంజాబ్లోని పఠాన్కోట్కు చెందిన నరేష్ శర్మ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనతోపాటు భారత ప్రజలపై తీవ్ర నేరాలకు పాల్పడిన కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ, ముంబై, బెంగళూరు పోలీసులు, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశాడు.
కాగా, ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ పిటిషన్ను కొట్టివేయడంతోపాటు ఆ వ్యక్తికి జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో అతడు డివిజన్ బెంచ్కు అపీల్ చేశాడు. తనకు ‘పరువు నష్టం’ కలిగించడంతోపాటు ‘దేశద్రోహ’ నిర్ణయం తీసుకున్న ఆ న్యాయమూర్తికి మరణశిక్ష విధించాలని పిటిషన్లో కోరాడు. ఆ మహిళా జడ్జిపై పోలీస్ కేసు నమోదు చేసి విచారణ జరుపాలని డిమాండ్ చేశాడు.
మరోవైపు ఈ పిటిషన్ను పరిశీలించిన ద్విసభ్య ధర్మాసనం అపీల్ చేసిన వ్యక్తికి ఆగస్ట్లో షోకాజ్ నోటీస్ జారీ చేసింది. హైకోర్టు మహిళా న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు చేయడంతోపాటు ఆమెను దెయ్యంతో పోల్చినందుకు అతడిపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని ఆ నోటీస్లో ప్రశ్నించింది.
ఐఐటీ కాన్పూర్, ముంబైతోపాటు అమెరికాలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ చదివిన అపీల్దారుడు నరేష్ శర్మకు భారత రాజ్యాంగం, భారత చట్టాలపై గౌరవం లేకపోవడంపై జస్టిస్ సురేష్ కుమార్ కైట్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని దిగజార్చడం, అనారిక పద్ధతిలో పిటిషన్ దాఖలు చేయడంపై మండిపడింది.
అంతేగాక సిట్టింగ్ జడ్జిని కించపరిచే పదజాలం వాడినందుకు, కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నరేష్ శర్మకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధించింది. ఆ జరిమానా చెల్లించకపోతే మరో ఏడు రోజులు జైలులో ఉంచాలని అక్టోబర్ 31న తీర్పు ఇచ్చింది. ఆ వ్యక్తిని అదే రోజు తీహార్ జైలుకు పంపాలని ఆదేశించింది.