భువనేశ్వర్: ఒక ముస్లిం మహిళ ఆన్లైన్ మోసంలో డబ్బులు పోగొట్టుకుంది. మరో రాష్ట్రంలో ఉన్న భర్తకు ఈ విషయాన్ని ఫోన్లో చెప్పింది. దీంతో ఆగ్రహించిన అతడు ఫోన్లో మూడు సార్లు తలాక్ (Triple Talaq) అని చెప్పి వెంటనే విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల ముస్లిం మహిళకు 15 ఏళ్ల కిందట ఒక వ్యక్తితో వివాహమైంది. ఆ దంపతులకు యుక్త వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ప్రస్తుతం గుజరాత్లో ఉన్నాడు. అయితే ఆ ముస్లిం మహిళ ఇటీవల సైబర్ మోసం వల్ల రూ.1.5 లక్షలు పోగొట్టుకుంది. ఏప్రిల్ 1న గుజరాత్లో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. దీంతో ఆ వ్యక్తి తన భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫోన్లోనే ట్రిపుల్ తలాక్ చెప్పి వెంటనే విడాకులు ఇచ్చాడు.
కాగా, తన భర్త మూడు సార్లు తలాక్ చెప్పడంతో ఆ మహిళ షాక్ అయ్యింది. అయితే 2017లో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ను రద్దు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానానికి వ్యతిరేకంగా చట్టం చేసింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్తో వెంటనే విడాకులు ఇచ్చిన భర్తపై ఆ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే కట్నం పేరుతో తనను హింసిస్తున్నట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆమె భర్తపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ మహిళ సైబర్ మోసం ద్వారా రూ.1.5 లక్షలు ఎలా పోగొట్టుకున్నది అన్నది తెలియలేదు.
Also Read: