న్యూఢిల్లీ: ఒక హత్యా కేసులో శిక్ష పడటంతో ఒక వ్యక్తి జైలుకెళ్లాడు. కరోనా సమయంలో పెరోల్పై బయటకు వచ్చాడు. అయితే ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసి ఆగ్రహించాడు. హోటల్కు ఆమెను రప్పించి కత్తితో పొడిచి చంపాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నేర (Crime) సంఘటన జరిగింది. 2010లో దీపక్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి రోహిణి ప్రాంతానికి చెందిన డాక్టర్ కుమారుడ్ని కిడ్నాప్ చేశాడు. రూ.20 లక్షలు డబ్బులు డిమాండ్ చేశాడు. డాక్టర్ డబ్బులు ఇవ్వకపోవడంతో అతడి కుమారుడ్ని హత్య చేసి మృతదేహాన్ని పడేశాడు. ఈ కేసులో దీపక్, అతడి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు వారికి కఠిన కారాగార శిక్ష విధించింది.
కాగా, 2020లో కరోనా విజృంభించిన సమయంలో దీపక్ పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే తన ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు అతడికి తెలిసింది. దీంతో ఆమెపై కక్షగట్టాడు. సుల్తాన్పురి ప్రాంతంలోని ఒక హోటల్కు ఆ మహిళను రప్పించాడు. అక్కడకు వచ్చిన ఆమెను కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయాడు.
మరోవైపు ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు దీపక్ కోసం వెతికారు. మంగోల్పురి ప్రాంతంలోని ఒక ఇంట్లో అతడు ఉంటున్నట్లు సాంకేతిక ఆధారాలు, ఇతరుల సమాచారం ద్వారా తెలుసుకున్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళి నిందితుడు దీపక్ను అరెస్ట్ చేశారు.
Also Read: