న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని లాడ్జిలో ఇటీవల జరిగిన వ్యాపారి హత్య కేసు (Delhi Lodge Murder Case)లో మరో కోణం బయటపడింది. హానీ ట్రాప్ ముఠాకు చెందిన ఒక మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్కు చెందిన నిందితురాలిని 29 ఏళ్ల ఉషాగా గుర్తించారు. ఆమెకు అంజలి, నిక్కీ, నికితతో సహా అనేక మారుపేర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తులతో ఆమె స్నేహం చేసి హోటళ్లకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి వారిని దోచుకుంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే వ్యాపారి హత్య జరిగిందని వెల్లడించారు.
కాగా, మార్చి 30న ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్ ప్రాంతంలోని లాడ్జిలో 53 ఏళ్ల బిజినెస్ మ్యాన్ దీపక్ సేథి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆయన నోటి నుంచి నురగ రావడంతో డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల చనిపోయి ఉంటాడని పోలీసులు తొలుత అనుమానించారు. వ్యాపారి మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన కాంటాక్ట్ లిస్ట్లోని కొత్త కాంటాక్ట్ను అనుమానించి ఆ వ్యక్తి గురించి ఆరా తీశారు. మార్చి 20న తప్పుడు పత్రాలతో సిమ్కార్డ్ పొందినట్లు గుర్తించారు. మార్చి 23న పశ్చిమ ఢిల్లీలోని సంత్ఘర్ ప్రాంతంలో ఆ మొబైల్ నంబర్ రీచార్జ్ చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు.
మరోవైపు ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు రీచార్జ్ చేసిన నైజీరియా వ్యక్తి చిడ్ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా వ్యాపారి హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఉషా అని తెలిసింది. 2022లో హర్యానాలోని పానిపట్లో నమోదైన కేసులో ఆమె జైలుకు వెళ్లినట్లు నైజీరియా వ్యక్తి తెలిపాడు. ఈ సందర్భంగా తాను సహజీవనం చేస్తున్న మధుమితతో జైలులో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు చెప్పాడు. అనంతరం హానీ ట్రాప్ ముఠాగా ఏర్పడి పలువురిని దోచుకున్నట్లు వెల్లడించాడు.
కాగా, మార్చి 30న కన్నాట్ ప్లేస్ మెట్రో స్టేషన్ వద్ద తనకు తెలిసిన దీపక్ సేథిని మధుమిత కలిసింది. ఈ సందర్భంగా తన వెంట ఉన్న ఉషాను ఆయనకు పరిచయం చేసింది. ఆ తర్వాత దీపక్, ఉషా కలిసి రాత్రి 9.30 గంటలకు బల్జీత్ లాడ్జికి వెళ్లారు. డ్రగ్స్ మత్తులో ఉన్న దీపక్ సేథీని హత్య చేసి అతడి వద్ద ఉన్న డబ్బు, గోల్డ్ రింగ్, మొబైల్ ఫోన్, ఇతర వస్తువులను ఉషా దోచుకుంది. ఆ తర్వాత సారీ అంటూ ఒక నోట్ కూడా అక్కడ ఉంచింది. ‘నువ్వు మంచి వ్యక్తివి. సారీ… సారీ… సారీ. చాలా బలవంతంగా నాతో ఈ పని చేయించారని అర్థం చేసుకో. దాని వల్లే నిన్ను ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు’ అని అందులో రాసింది. అనంతరం అర్ధరాత్రి 12.24కు ఆమె ఆ లాడ్జి నుంచి బయటకు వెళ్లిపోయింది.
మరోవైపు లాడ్జి గదిలో దీపక్ సేథి మృతదేహం వద్ద ఉన్న ‘సారీ’ నోట్ను పోలీసులు గుర్తించారు. అది ఉషా రాసినట్లు ఆమె ద్వారా తెలుసుకున్నారు. ఉషా అరెస్ట్ తర్వాత ఆమె బ్యాగ్లో ఉన్న మృతుడి మొబైల్ ఫోన్, గోల్డ్ రింగ్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: