తిరువనంతపురం: ఒక వ్యక్తికి రోడ్డు పక్కన మద్యం బాటిల్ దొరికింది. దీంతో స్నేహితులకు గిఫ్ట్గా దానిని ఇచ్చాడు. ఆ మద్యం తాగిన ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదిమాలిలోని ఓ ప్రాంతంలో సోమవారం ఉదయం రోడ్డు పక్కన పడి ఉన్న మద్యం సీసా ఒక వ్యక్తికి కనిపించింది. దానిని తీసుకున్న అతడు తన స్నేహితులకు ఫోన్ చేశాడు. ఆ లిక్కర్ బాటిల్ కావాలా అని వారిని అడిగాడు. కావాలని చెప్పడంతో వారికి ఆ మద్యం సీసా ఇచ్చాడు.
కాగా, బాటిల్లోని మద్యాన్ని సేవించిన ముగ్గురు స్నేహితులైన మనోజ్, కుంజుమోన్, అనిల్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకోవడంతో వారిని తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. కుంజుమోన్ పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. స్నేహితుడు మద్యం బాటిల్ ఇవ్వగా అది తాగి అస్వస్థత చెందినట్లు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు.
మరోవైపు రోడ్డు పక్కన దొరికిన దేశీయ తయారీ మద్యం బాటిల్లో కొన్ని రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే మద్యం సీసా దొరికిందని చెప్పిన వ్యక్తి తాను తాగకుండా స్నేహితులకు దానిని ఇవ్వడంపైనా సందేహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి మద్యం సీసాలో ఏమైనా కలిపి ఉంటాడా అని కూడా అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.