Court verdict : పోక్సో కేసులో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తికి తమిళనాడు కోర్టు రెండు మరణశిక్షలు విధించింది. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లాలోని విలాతిళకం ప్రాంతానికి చెందిన 12వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో ధర్మ మునీశ్వరన్ అనే వ్యక్తి దోషిగా తేలాడు. దాంతో అతనికి రెండు మరణశిక్షలను విధిస్తూ పోక్సో కోర్టు కీలక తీర్పును వెలువరించింది. మునీశ్వరన్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా అతి దారుణంగా ప్రవర్తించినందుకుగానూ ఈ శిక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. దీనిని అరుదైన కేసుగా పేర్కొన్నది. గతంలోనూ మునీశ్వరన్కు పలు నేరాల్లో ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది.
విలాతికుళం సమీపంలోని వేదనాథం గ్రామానికి చెందిన పన్నెండో తరగతి విద్యార్థిని మార్చి 10వ తేదీ సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయినా వారు పెద్దగా పట్టించుకోలేదు. మరుసటి రోజు వేదనాథం అటవీ ప్రాంతంలో తీవ్ర గాయాలతో బాలిక విగతజీవిగా కనిపించింది. ఈ క్రమంలో తాము ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. దాంతో ఈ కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు స్థానిక ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు.
అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మార్చి 19న నిందితుడిని అరెస్టు చేశారు. అతడు గతంలోనూ ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. విద్యార్థినిపై హత్యాచారం జరిగిన సమయంలో అతడు బెయిల్పై బయట ఉన్నాడు.