
లక్నో: చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో ఏడు గంటలకుపైగా మార్చురీ ఫ్రీజర్లో ఉండి బతికిన వ్యక్తి చివరకు చికిత్స పొందుతూ మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 18న 45 ఏండ్ల శ్రీకేష్ కుమార్ను బైక్ ఢీకొట్టింది. పరిస్థితి సీరియస్గా ఉన్న అతడ్ని బంధువులు మూడు ఆసుపత్రులకు తిప్పారు. జిల్లా ఆసుపత్రిలో పరిశీలించిన వైద్యులు శ్రీకేష్ మరణించినట్లు తెలిపారు. అతడు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి కావడంతో అక్కడి మార్చురీలోని ఫ్రీజర్లో అతడి బాడీని ఉంచారు.
మరునాడు పోస్ట్మార్టం కోసం సంబంధిత పత్రాలపై సంతకాల నిమిత్తం పోలీసులు, బంధువులు వచ్చి చూడగా శ్రీకేష్ కుమార్ శ్వాస తీసుకోవడాన్ని గుర్తించారు. సుమారు ఏడు గంటలు మార్చురీలోని ఫ్రీజర్లో ఉన్న అతడు బతికే ఉన్నాడని గ్రహించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందించారు.
అయితే శ్రీకేష్ కుమార్ చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రి వైద్య అధికారి డాక్టర్ శివ సింగ్ తెలిపారు. దీంతో అతడు బతుకుతాడని భావించిన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
.