లక్నో : భార్య మరొకరితో సంబంధం పెట్టుకోవడం తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గోమతి నగర్లో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. గోమతి నగర్కు చెందిన నిఖిల్కు 2012లో వివాహం కాగా, ఒక కుమార్తె ఉంది. నిఖిల్ కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా, భార్య ఓ ఎన్జీవో సంస్థలో పని చేస్తోంది.
అయితే భార్య తన సహోద్యోగితో గత కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కుటుంబాన్ని పట్టించుకోవడం కూడా మానేసింది. సహోద్యోగితో సన్నిహితంగా ఉండటం మానుకోవాలని భార్యను నిఖిల్ హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డు రావొద్దని భార్య భర్త నిఖిల్ కు తెగేసి చెప్పింది. లేదంటే అంతు చూస్తానని బెదిరించింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలిలో నాలుగు పేజీల లేఖ లభ్యమైంది. తన చావుకు భార్య, ఆమె ప్రియుడే కారణమని, వారిద్దరిని కఠినంగా శిక్షించాలని నిఖిల్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.