గువాహటి: అసోంలో ఘోరం జరిగింది. చారైడియో జిల్లా గెలెకీ బ్లాక్ పరిధిలోని ఓ గ్రామంలో ప్రసాదం వికటించి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు కొందరిని ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ధాన్యపు గింజలు, పండ్ల ముక్కలతో చేసిన ప్రసాదాన్ని కుటుంబసభ్యులు కార్యక్రమానికి వచ్చిన అందరికీ పంపిణీ చేశారు.
ఆదివారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరుగగా.. సాయంత్రానికి 50 మంది అస్వస్థతకు గురయ్యారు. దాంతో అందరినీ గెలెకీ బ్లాక్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వారి పరిస్థితిని పరీక్షించిన వైద్యులు.. సీరియస్గా ఉన్న వారిని జిల్లా హెడ్క్వార్టర్స్లోని ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. వారిలో ఒక వ్యక్తి పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతిచెందాడు.
కాగా, ఘటన నేపథ్యంలో సోమవారం ఉదయం వైద్యాధికారులు గ్రామాన్ని సందర్శించారు. ప్రాథమిక విచారణ చేసి పూజా కార్యక్రమం కోసం సరుకులు విక్రయించిన వ్యక్తి దుకాణాన్ని సీజ్ చేశారు. అందులో ప్రసాదం కోసం వినియోగించిన పదార్థాలను పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. పరీక్షల్లో ఆ పదార్థాలు విషపూరితమైనట్లు తేలితే దుకాణం యజమానిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.