విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు
చెన్నై, జూలై 18: ప్రేమించిన బాలిక పెండ్లికి నిరాకరించిందని హైటెన్షన్ విద్యుత్ సరఫరా టవర్ ఎక్కాడో 19 ఏండ్ల యువకుడు. ఈ ఘటన తమిళనాడులోని తాంబరంలో చోటుచేసుకున్నది. దీంతో అక్కడ దాదాపు 2 గంటల పాటు హైడ్రామా నడిచింది. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అధికారులు, కుటుంబసభ్యులు, స్నేహితులు ఎంత కోరినా కిశోర్ అనే ఆ యువకుడు కిందకు దిగిరాలేదు. చివరకు బాలికను తీసుకొచ్చి పెండ్లి చేసుకుంటానని చెప్పిస్తేనే.. యువకుడు టవర్ పైనుంచి కిందకు వచ్చాడు. పోలీసులు అతన్ని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపారు.
పెయింటర్గా పనిచేసుకునే కిశోర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 15 ఏండ్ల ఓ బాలికను ప్రేమించాడు. పెండ్లి చేసుకోమని పలుమార్లు కోరినా ఆమె నిరాకరించడంతో శుక్రవారం ఉదయం ఓ విద్యుత్ టవర్ ఎక్కి ఈ భయాందోళన సృష్టించాడు.