ముంబై: పలువురితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఒక వ్యక్తి తన వదినతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను గొంతునొక్కి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాలను దహనం చేసి పారిపోయాడు. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘోరం (Pune Horror) జరిగింది. కోంద్వా ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల వైభవ్ వాఘ్మారే, 25 ఏళ్ల వదిన ఆమ్రపాలి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు పలువురు వ్యక్తులతో వివాహేత సంబంధం ఉందంటూ బుధవారం రాత్రి గొడవకు దిగాడు. ఈ సందర్భంగా పీక నొక్కి ఆమెను హత్య చేశాడు. ఆమె ఇద్దరు పిల్లలైన ఐదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తెను కూడా గొంతు నొక్కి చంపాడు. అనంతరం ఇంటి బయట వారి మృతదేహాలను ఉంచి పెట్రోల్ పోసి నిప్పంటించి దహనం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఆ ఇంటి నుంచి పొగలు, మంటలను స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలిన మృతదేహాలను పరిశీలించారు. పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు వైభవ్ను గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: