Rajasthan | అళ్వార్ (రాజస్థాన్), జూన్ 2: ఐదు, పది కాదు 33 ఏండ్ల క్రితం తప్పిపోయిన ఇంటి పెద్ద హఠాత్తుగా తిరిగి వస్తే ఎలాగుంటుంది? చనిపోయాడనుకుని శ్రాద్ధకర్మలు కూడా చేసిన ఆ కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏంటి? ఇలాంటివి మనం సినిమాల్లో, సీరియళ్లలో చూస్తుంటాం. కానీ ఆశ్చర్యం గొలిపేలా ఇలాంటి ఘటన రాజస్థాన్లోని అళ్వార్లో జరిగింది. 75 ఏండ్ల హనుమాన్ సైనీ ఢిల్లీలోని ఖరీ బవోలి ప్రాంతంలో పనిచేస్తుండగా, 1989లో హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అప్పటికి అతని వయసు 42 ఏండ్లు. భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. అతని కోసం బంధువులు, కుటుంబ సభ్యులు అనేక చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు.
అసలు బతికి ఉన్నాడో, లేడో కూడా తెలియని స్థితిలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందేవారు. అలా మూడు దశాబ్దాలు గడిచినా అతని గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో మరణించి ఉంటాడని భావించి గత ఏడాది కుటుంబ సభ్యులు శ్రాద్ధకర్మలు చేసి, అధికారుల నుంచి డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. అయితే గత నెల 30న హనుమాన్ హఠాత్తుగా సొంత ఊరుకు చేరుకున్నాడు. ఇన్నాళ్లకు సజీవంగా తిరిగి రావడంతో గ్రామస్థులు, బంధువులు అతనికి ఘన స్వాగతం పలికి వేడుక జరుపుకున్నారు. ఇప్పటికే సైనీ ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారుల పెండ్లి కూడా అయిపోయింది. మనవలు కూడా ఉన్నారు.
33 ఏండ్లుగా ఎక్కడ ఉన్నావు… ఏం చేశావు? అని బంధువులు అడిగిన ప్రశ్నకు హనుమాన్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం గొలిపింది. ఇన్నాళ్లూ తాను ఏ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేయలేదని, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా మాత ధ్యానం, సేవలోనే గడిపానని తెలిపాడు. ‘చేసిన సేవలు చాలు.. ఇక నీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకో’ అని మాత ఇచ్చిన ఆదేశాల మేరకు సొంత ఊరికి వచ్చానని తెలిపాడు. టికెట్ తీయడానికి కూడా తన దగ్గర డబ్బులు లేకపోయినా టీసీయే తనకు పఠాన్కోట్ వరకు టికెట్ తీసి పంపినట్టు హనుమాన్ వివరించాడు.