Mamatha Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి ఝలక్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్ విధానం ద్వారా చిత్తరంజన్ దాస్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ రెండో క్యాంపస్ను ప్రారంభించారు. ఈ సమయంలో సీఎం మమత కూడా ఉన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం మమత స్పందించారు. ఈ కార్యక్రమం ఇంతకు ముందే జరిగిపోయిందని మమత వ్యాఖ్యానించారు. అయితే మమత చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మాత్రం స్పందించలేదు.
వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మమత ఏమన్నారంటే.. ‘ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయంపై కేంద్ర ఆరోగ్యమంత్రి నాకు రెండు సార్లు ఫోన్ చేశారు. కలకత్తా కార్యక్రమం కాబట్టి ప్రధాని మోదీ ఈ విషయంపై శ్రద్ధ చూపారు. కానీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని మేం ముందుగానే నిర్వహించేశాం. కోవిడ్ పెరిగిపోయిన సమయంలో మాకు ఓ కోవిడ్ సెంటర్ అవసరమైంది. అప్పుడే నేను ఈ క్యాంపస్ను చూశా. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని తెలుసుకున్నా. ఓ సెంటర్ను ఏర్పాటు చేసేశాం. దీని కోసం 25 శాతం నిధులను కూడా ఇచ్చాం. మిగతా అవసరాల కోసం 71 శాతం నిధులను కూడా భరిస్తున్నాం. ఈ క్యాంపస్ కోసం 11 ఎకరాల స్థలం కూడా ఇచ్చామని మీ దృష్టికి తెస్తున్నాం’ అంటూ మమత వ్యాఖ్యానించారు.