బెంగాల్లో పీఏసీ చైర్మన్గా ముకుల్ రాయ్
కోల్కతా, జూలై 9: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీకి ‘టెక్నికల్ షాక్’ ఇచ్చారు. బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్కి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవి అప్పజెప్పారు. ఆమె నిర్ణయానికి స్పీకర్ బిమాన్ బెనర్జీ ఆమోదముద్ర వేశారు. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. వాస్తవానికి పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతలకు కేటాయిస్తారు. ఆ మేరకు ఈ పదవికి బీజేపీ ఆరుగురి పేర్లను సూచించినా దీదీ మాత్రం ముకు ల్ రాయ్నే ఆ పదవిలో నియమించ డం గమనార్హం. రాయ్ టీఎంసీలో చేరినా ఇప్పటికీ ఆయన బీజేపీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. దీనిపై బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ముకుల్ రాయ్ పబ్లిక్గా టీఎంసీలో చేరినా నిబంధనలకు విరుద్ధంగా ఆయనను పీఏసీ చైర్మన్గా నియమించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు.