కోల్కతా: ‘మమతాజీ.. బెంగాలీ ప్రజలు ఎవరికీ భయపడరు’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మానిక్చాక్లో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. బెంగాల్ సీఎం మమతా బెనర్జిపై విమర్శలు గుప్పించారు. బెంగాలీలు ఎవరికీ భయపడరని, తమరి నిరంకుశత్వ పాలన నుంచి వారు విముక్తిని కోరుకుంటున్నారని మమతాబెనర్జిని ఉద్దేశించి నడ్డా వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే బెంగాల్ ఓటర్లు మమత ఓటమిని ఖాయం చేశారని, మిగిలిన 7, 8 విడుతల ఎన్నికల్లో సైతం కమలం పువ్వుకే వారు ఓటేస్తారని నడ్డా ధీమా వ్యక్తంచేశారు. కరోనా మహమ్మారి కట్టడి విషయంలో మమతా బెనర్జి ఏదీ సరిగా చేయలేరని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఏర్పాటు చేసిన ఒక్క సమావేశానికి కూడా ఆమె రాలేరని విమర్శించారు.
ప్రధానితో సమావేశాలకు హాజరుకాకుండా మమతాబెనర్జిని ఎవరు అడ్డుకున్నారని జేపీ నడ్డా ప్రశ్నించారు. మమతను అడ్డుకున్నది ఆమె ఈర్శ్య, అరాచకత్వమే కాదా..? అని ఓటర్లను అడిగారు. బెంగాల్ అభివృద్ధికి నోచుకోకపోవడానికి కూడా కారణం కేవలం మమతాబెనర్జి అరాచకత్వమేనని నడ్డా మండిపడ్డారు.